ఘట్కేసర్, జూలై: ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణకు మరింత బలోపేతం కల్పించే లక్ష్యంతో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్థానిక దాతల సహకారంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోమసాని రమేష్, సోమసాని వెంకటేష్, తలతోటి వరమ్మ దాతలుగా సహకారం అందించారు.
ఈ సందర్భంగా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, గ్రామం, అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
అనంతరం ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలకు ఘట్కేసర్ పోలీసు శాఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమాన్ని మరింత విస్తరించి ప్రతి కాలనీ, గ్రామాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతోనే నేర రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.



