కాంగ్రెస్తోనే గ్రామాల ప్రగతిపథం
రూ. 70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం రూ. 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు ప్రతిపాదిత అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా చెన్నారావుపేట మండలంలోని ఆమీనాబాద్ గ్రామంలో రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను, ఎల్లాయగూడెంలో రూ. 10 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, మరో రూ. 10 లక్షలతో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అదేవిధంగా చెన్నారావుపేటలో రూ. 10 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణ మిగులు పనులు, అక్కల్ చెడలో రూ. 10 లక్షలతో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణ మిగులు పనులు, లింగాపురంలో రూ. 10 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణ మిగులు పనులను ఆయన ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక సాధికారతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకే ఈ నూతన భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహశీల్దార్ మహమ్మద్ అబిద్ అలీ, ఎంపీడీఓ వెంకట సాయి శివానంద్, ఏపీఎం తిలక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్, సర్పంచ్ కంది శ్వేతా రెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




