భారాసతో ఐటీకి అడుగులు
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
సిద్దాపూర్ భూముల పరిశీలన
ఏకో టౌన్షిప్ రద్దు చేయాలని డిమాండ్
భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే సిద్దాపూర్ శివారులో ఐటీ కారిడార్ కు అడుగులు పడేవని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ శివారులో టీజీఐఐసీ తన పరిధిలోని 86 ఎకరాల భూమిని ఏకో టౌన్షిప్ ఏర్పాటు కోసం జిహెచ్ఎంసికి బదిలీ చేస్తూ ఇటీవల జీవో 641 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అవసరాల కోసం నాటి బిఆర్ఎస్ సర్కారు సిద్ధాపూర్ శివారులో సుమారు 340 ఎకరాలను సేకరించిందని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలతో పాటు, కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో షాద్ నగర్ నియోజకవర్గానికి వచ్చిన కేసిఆర్, కేటీఆర్ కు సిద్దాపూర్ భూముల్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు విన్నవించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యం తప్ప, చదువుకున్న యువతకు𝕽 కొలువులు లేవని చెప్పడంతో కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి సిద్దాపూర్ భూముల్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు అడుగులు పడేవని ఆశాభావం వ్యక్తం చేశారు.
*ప్రజాభిప్రాయాలకు విలువ లేదా..*
ఏకో టౌన్షిప్ ఏర్పాటును స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని జీవో 641 తో స్పష్టం అయిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విమర్శించారు. ఆధునిక పరిజ్ఞానంతో ఘన వ్యర్థాలను కాలుష్య రహితంగా నిర్వీర్యం చేస్తామని చెప్పే ప్రభుత్వానికి ఆయన సూటిగా ఓ ప్రశ్న వేశారు. ఆ టెక్నాలజీ ఏదో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లోనే ఏర్పాటు చేసి అక్కడి ప్రజల సమస్యను తీర్చాలని కోరారు. కానీ, మహానగరం చెత్తను టన్నుల కొద్ది సేకరించి.. కిలోమీటర్ల మేర ప్రయాణించి.. సిద్దాపూర్ లో డంపుచేసి.. నిర్వీర్యం చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని లెక్కించారు. భారీ వ్యాయంతో కూడుకున్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మొండి వైఖరితో సిద్దాపూర్ లోనే ఏర్పాటు చేయాలని చూడడం వెనుక మర్మం ఏమిటో అర్థం కావటం లేదని విస్మయం వ్యక్తం చేశారు. పవిత్ర జహంగీర్ పీర్ దర్గా, శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఎస్టీ గురుకుల పాఠశాల, వ్యవసాయ రైతులు, పాడి పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏకో టౌన్షిప్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.




