గిరిజిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
– ఆమెను వివస్త్రను చేసి కొట్టిన టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి
: వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్
నెల్లూరు జిల్లా-(ప్రజావాణి జూన్ 27) కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద జరుగుతున్న దాడులు, అరాచకాలు,అత్యాచారాలపర్వం రెండేళ్లకే పరాకాష్టకు చేరుకుందని వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను తాకాలంటే భయపడే పరిస్థితి నుంచి తాము ఏం చేసినా పోలీసులు ఏమీ చేయరనే ధైర్యంతోనే టీడీపీ నాయకులు మహిళలపై దాడులు,అత్యాచారాలకు దిగుతూ బరితెగిస్తున్నారని ధ్వజమెత్తారు.భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న గిరిజన మహిళను టీడీపీ నాయకులు వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హింసించడమే కాకుండా ఆమె కొడుకుపైనే కేసు నమోదు చేయడం చూస్తే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ఈనెల 19న ఘటన జరిగితే 26వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదని,పైగా ఆమె ఎక్కడుందో కూడా చెప్పకుండా రహస్యంగా చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. ఆమె కొడుకు ఒక ముస్లిం యువతిని ప్రేమించడమే నేరమైందని,దానికి టీడీపీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం కుటుంబసభ్యులు బహిరంగంగా బట్టలూడదీసి అవమానిస్తే పోలీసులు వంతపాడటం సిగ్గుచేటన్నారు.నెల్లూరు జిల్లా కావలి కచేరిమిట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చూస్తే కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణపై ఆందోళనలు కలుగుతున్నాయని చెప్పారు.మరో ఘటనలో దుత్తలూరు మండలం భీమవరంలో సుజాత అనే మహిళను దారుణంగా కొట్టినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు.పోలీసులు పొలిటికల్ బాస్ల ఆదేశాలను పాటించడం మానేసి చట్టానికి లోబడి పనిచేస్తే నేరాలు అదుపులోకి వస్తాయని హితవు పలికారు.టీడీపీ రౌడీ మూకల కారణంగా రాష్ట్రంలో మహిళల పరిస్ధితి ఇంత దారుణంగా ఉంటే హోంమంత్రి అనిత మాత్రం స్పందించిన దాఖలాలు లేవని,వైయస్ జగన్ని తిట్టడానికి మాత్రమే మీడియా ముందుకొచ్చి పోతుంటారని కాకాణి పూజిత ఆరోపించారు.
పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసిందని, వైయస్సార్సీపీ నాయకులను కలిస్తేనే తమకు న్యాయం జరుగుతుందనే ధీమాతో ప్రజలు ఉన్నారన్నారు. పోలీసుల వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో చెప్పడానికి సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘనటలే నిదర్శనం అన్నారు.హోంమంత్రి అనిత తక్షణం గిరిజిన మహిళ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయాలని,ఆమెను వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




