విలేకరుల ఇళ్ల స్థలాల సాధనకై పోరాట: కడప జేసీకి అర్జీ సమర్పణ!పోరుమామిళ్ల, జూన్ 12:పగలు, రాత్రి అనక ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టుల సొంతింటి కల ఎప్పటికీ నెరవేరేనా? దశాబ్దాలుగా వార్తలు రాస్తూ సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న విలేకరుల ఇళ్ల స్థలాల సమస్యను పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు?తాజాగా శుక్రవారం పోరుమామిళ్ల వేదికగా జరిగిన “భూ సమస్యల పరిష్కార వేదిక” (ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు) కార్యక్రమంలో పోరుమామిళ్ల, బి.కోడూరు, కలసపాడు, నర్సాపురం మండలాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను కడప జాయింట్ కలెక్టర్ (జేసీ) దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు వారికి అర్జీ సమర్పించి, తక్షణమే స్పందించి స్థలాలు మంజూరు చేయాలని ఘాటుగా డిమాండ్ చేశారు.విలేకరుల ప్రశ్నలు – పాలకుల ఉదాసీనత:సమస్యల రాతగాళ్లకు నిలువ నీడేది? సమాజంలో ప్రతి ఒక్కరి సమస్యలపై కలం ఎత్తే విలేకరులకు,సొంతంగా ఒక సెంటు భూమి కూడా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.కమిటీల పేరుతో కాలయాపన వద్దు: గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎందరో అధికారులు హామీలు ఇచ్చినా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఫైళ్లు మాత్రం దుమ్ముధూళిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.ఇప్పటికైనా స్పందించండి: ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాలయాపన చేయకుండా పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, నర్సాపురం మండలాల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విలేకరుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.




