*ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి*
*ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఐపీఎస్*
*షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్*
*ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02 :
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ మంగళవారం సందర్శించి స్టేషన్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో శాంతిభద్రతల నిర్వహణ, నేరాల దర్యాప్తు, నివారణ చర్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, వినతిపత్రాల పరిష్కారం, నేర గణాంకాలు, శాఖాపరమైన కార్యక్రమాల అమలుపై సమీక్ష చేపట్టారు.
పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రజామిత్ర విధానంలో సేవలు అందించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బీట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు (వీపీఓలు) గ్రామాల్లో సమాచార సేకరణను ముమ్మరం చేసి అనుమానాస్పద కదలికలు, కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో సమన్వయం పెంచి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, అలవాటు నేరస్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వ్యాప్తి, అక్రమ కార్యకలాపాలు, సైబర్ నేరాలు, జూదం తదితర నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మహిళల భద్రత, బాలల రక్షణ, వృద్ధుల సంక్షేమం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేరాల ఛేదన, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ వినియోగాన్ని పెంచాలని తెలిపారు.
శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం, ప్రజా శాంతి పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు.
పోలీస్ స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్, ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో షాద్నగర్ జోన్ డీసీపీ షిరీషా రాఘవేంద్ర, షాద్నగర్ డివిజన్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సిఐ సీతారాం తదితరులు పాల్గొన్నారు…
ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి
RELATED ARTICLES




