ఘట్కేసర్, మే 30 (ప్రజావాణి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు మన్నె సంజీవరావు ఇటీవల ద్విచక్ర వాహనం నుంచి జారి కిందపడడంతో కుడి కాలుకు తీవ్ర గాయం కాగా, ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా జనగామ ఇన్చార్జి హరి, ఘట్కేసర్ నాయకులు వేముల సంజీవ్ గౌడ్, సామల జగన్మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సతీష్తో పాటు తెలుగు యువత నాయకులు మన్నె సంజీవరావు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నాయకులు సంజీవరావుకు మనోధైర్యం కల్పిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, సరైన వైద్యం తీసుకుంటే త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


