*ఉల్లాస్ కార్యక్రమం పై అవగాహన సదస్సు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన శిక్షణ కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP–2020) లో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ (ULLAS – Understanding of Lifelong Learning for All in Society) కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాలలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆర్.పి లు, ఎస్.ఎల్.ఎఫ్ ఓబిలకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర, డి.డి. శ్రీ చి. అనిల్ కుమార్, డి.ఎం.సి శివాజీ, టి.ఎం.సి శ్రీనివాస్, సి.ఓలు, సి.ఎల్.ఆర్.పిలు, ఆర్.పిలు, ఎస్.ఎల్.ఎఫ్ ఓబిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళలు మరియు నిరక్షరాస్యులకు చదవడం, రాయడం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఆన్లైన్ బిల్లుల చెల్లింపు, బ్యాంక్ ఖాతాల నిర్వహణ, పొదుపు అలవాట్లు, ఏటీఎం వినియోగం వంటి అంశాలలో అవగాహన పెంపొందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడతారని పేర్కొన్నారు. ప్రతి మహిళ చదువుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ, ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చట్టపరమైన అవగాహన, పౌర హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డి.డి. అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, పొదుపు అలవాట్లు పెంపొందించడం, ఏటీఎం వినియోగం, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డి.ఎం.సి శివాజీ మాట్లాడుతూ, ప్రతి మహిళ అక్షరాస్యురాలిగా మారడం ద్వారానే సమాజంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.పిలు, ఎస్.ఎల్.ఎఫ్ సభ్యులకు ఉల్లాస్ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం మరియు ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై విస్తృతంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.



