చిత్తూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్28) వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యపై తీవ్ర ఖండన వ్యక్తమవుతోంది.జర్నలిజం అంటే సమాజాన్ని సరిదిద్దే బాధ్యతతో ప్రతి చెడును ప్రశ్నించడం అని మనం ఎప్పటి నుంచో చెబుతున్నాం.కానీ అసలు ప్రశ్నించే తత్వం ఇప్పటికీ బతికే ఉందా అనే సందేహం కలుగుతోంది. చెడు వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాలంటే ముందుగా ప్రశ్నించే ధైర్యం కావాలి.ఆ ధైర్యం ఎంతమందిలో ఉంది.నిజాయితీగా చూస్తే,ఈ తత్వం కొద్దిమందిలో మాత్రమే ఉందనిపిస్తోంది. ప్రశ్నించడమే జర్నలిజం ప్రాణం,సమాజంలో జరిగే అన్యాయాలు,అక్రమాలు,దోపిడీలు ఇవన్నీ జర్నలిస్టులకు బయటపెట్టే బలమైన ఆయుధం ప్రశ్న.బలహీన వర్గాలు,బాధితులు తమ గొంతు వినిపించలేని చోట,వారి తరఫున నిలబడాల్సింది మీడియా. కానీ నేడు అదే మీడియా నిజంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తోందా?లేక ప్రశ్నించే గొంతుకలే మూగబోయాయా అనే ఈ ప్రశ్నలు అర్ధం చేసుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు.ప్రజా స్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది.అయితే ఆ హక్కు ను వినియోగించడంలో ప్రజలు వెనుకబడితే, కనీసం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ఏమి చేస్తుంది.కానీ ఇటీవల కాలంలో మీడియా అన్యాయాలపై ప్రశ్నించడం మానేసిందనే విమర్శలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి.అయితే కొందరు జర్నలిస్టులు ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోయారు.కొత్తగా మీడియాలోకి వచ్చినవారు కొందరు సొంత ప్రయోజనాలకే పరిమితం అవుతూ నిజాన్ని వెలికితీయడం వంటి బాధ్యతల నుంచి దూరమవుతున్నారు.ఇది పరిశోధనాత్మక జర్నలిజా నికి పెద్దదెబ్బగా మారింది. ఒకప్పుడు నిజం కోసం పోరాడిన కలం, ఇప్పుడు కొన్నిచోట్ల విషం చిమ్మే సాధనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.సమాజంలో జరుగుతున్న అక్రమాలు,సహజసంపదల దోపిడీ,ప్రజల హక్కుల హరణ ఇవి అన్నీ మన కళ్లముందే జరుగుతున్నా,వాటిని ప్రశ్నించే నిఘా నేత్రాలు ఎక్కడా కనిపించడం లేదు.ఆ నేత్రాలు ఎప్పుడో మసకబారి నేరాలు-ఘోరాలకు దారులు చూపాయి. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే,మీడియా తాము చెప్పిందే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.అక్షరాల మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ,కట్టుకథలను సత్యాలుగా మలచే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు వాస్తవం-అవాస్తవం మధ్య తేడా తెలియకుండా మోసపోతున్నారు.నిజం పలకలేని జర్నలిజం,ప్రశ్నించలేని మీడియా,ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతాలు.కెమెరాలు వాస్తవాలను చూపకపోతే,జర్నలిస్టుల చేతిలో లోగోతో ఉన్న మైకులు నిజాలను వినిపించక పోతే,జర్నలిజం ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.విలువలతో పనిచేసే జర్నలిస్టు లు పక్కకు నెట్టబడితే,వ్యవస్థ మొత్తం బలహీనపడుతుంది.జర్నలిజం అంటే డబ్బుకు పనిచేసే వృత్తి కాదు.నిజానికి సేవ చేసే ధర్మం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కట్టుకథలు రాయడం జర్నలిజం కాదు.అది వృత్తిపరమైన అవమానం.అందుకే నిజాన్ని నిజంగానే,అబద్ధాన్ని అబద్ధంగానే చెప్పే ధైర్యం మళ్లీ జర్నలిజంలో రావాలి.
ఇప్పటికైనా ప్రశ్నించే గొంతుకలు ఈ సమాజం లో మళ్లీ వినిపించాలి. నిజం బయటపడాలి.మంచి-చెడు రెండింటినీ సమాజం చూస్తుంది,కానీ మంచి నిలవాలంటే నిజం నిలవాలి.జర్నలిస్టులు అందరూ నిజాయితీగా నిలబడి జర్నలిజాన్ని తిరిగి బ్రతికించాలి. లేదంటే,ఈ ప్రక్షాళన బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సి వస్తుంది.ఈ విషయంలో అచ్చు కాబడిన అక్షరాలకు ఓ విలువ ఉంటుంది అని నమ్మి మీడియాను ఆదరిస్తున్న ప్రజలు పత్రికలు చదవడం మానేసినా.చేతిలో ఉన్న టి.వి రిమోట్ కి చేత్తో పనిచెప్పినా చాలు మీడియా ప్రక్షాళన మార్గంలోకి రాక తప్పదు.
ప్రశ్నించేతత్వం లేని జర్నలిస్టుల వల్ల జర్నలిజం ప్రమాదంలో ఉన్నట్లే..
RELATED ARTICLES

