బెజ్జంకి,ఏప్రిల్ 17(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలకు తగిన వసతులు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని అన్ని గ్రామాల కూలీలు ప్రస్తుతం పనుల్లో పాల్గొంటున్నప్పటికీ, తీవ్రమైన ఎండల కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.పని ప్రదేశాల్లో చల్లటి తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య కిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే గ్రామాల నుండి పని ప్రదేశాలు దూరంగా ఉన్న సందర్భాల్లో రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి కొత్త విధానాలను తీసుకురావడం వల్ల కూలీలకు నష్టం జరుగుతోందని విమర్శించారు.నూతన నిబంధనల కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఫోటోలు, ఐరిస్ నమోదు వంటి అంశాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.అలాగే కూలీలకు ప్రతి వారం కూలి డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

