కోహెడ, సెప్టెంబర్ 8 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై కోహెడ పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని తంగళ్లపల్లి, వింజపల్లి గ్రామాల పరిధిలోని మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.ఈ దాడుల్లో రెండు ఇసుక ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాల్లో తరలిస్తున్న ఇసుకకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఘటనకు సంబంధించి తంగళ్లపల్లికి చెందిన బిగుల్ల నరేష్ (23), బుర్ర శ్రీకాంత్ (30), కోతూరి నరేష్ (40), వింజపల్లికి చెందిన గీకూరు రమేష్ (34), గీకూరు అజయ్ (33)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్లు, బొలెరో వాహనాలను కోహెడ పోలీస్ స్టేషన్కు తరలించి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా కోహెడ ఎస్సై పి. అభిలాష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపుకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని,అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.

