📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఅర్హత లేని ల్యాబ్‌లతో పేదల ప్రాణాలతో చెలగాటం! ఎండీ పాథాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండానే పరీక్షలు?

అర్హత లేని ల్యాబ్‌లతో పేదల ప్రాణాలతో చెలగాటం! ఎండీ పాథాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండానే పరీక్షలు?

📰 Generate e-Paper Clip


అర్హత లేని ల్యాబ్‌లతో పేదల ప్రాణాలతో చెలగాటం!
ఎండీ పాథాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండానే పరీక్షలు?
ములుగు జిల్లాలోని పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్‌ల నిర్వహణపై ఆరోపణలు
అక్రమ ల్యాబ్‌లపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
ములుగు, ఆగస్టు 5 (ప్రజావాణి):
ములుగు జిల్లాలోని పలు మండలాల్లో అర్హతలు, నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్ వైద్య పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రక్తం, మూత్రం తదితర వైద్య పరీక్షలు అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణ లేకుండానే నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆదివాసీ, గిరిజన, పేద ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల పర్యవేక్షణ ఎక్కడ?
వైద్య పరీక్షా కేంద్రాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాల్సి ఉండగా, జిల్లాలోని కొన్ని ల్యాబ్‌లలో అవి అమలవుతున్నాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా ఫలితాలను అర్హత కలిగిన వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య పరీక్షలు సూచిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ల్యాబ్‌కు ప్రతిరోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు? వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా? పరీక్షలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన అర్హతలు ఉన్నాయా? నిపుణుల పర్యవేక్షణ ఉందా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
తప్పుడు రిపోర్టులతో ముప్పు
కొన్ని ల్యాబ్‌లు తక్కువ ధరలకు పరీక్షలు చేస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరీక్షల్లో తప్పులు జరిగితే రోగులకు తప్పుడు వైద్య నివేదికలు అందే అవకాశం ఉందని, వాటి ఆధారంగా తప్పు చికిత్స పొందితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు, గిరిజనులు వైద్య సేవల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లపై ఆధారపడుతున్న నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని స్థానికులు కోరుతున్నారు.
అన్ని ల్యాబ్‌లపై సమగ్ర తనిఖీలు చేయాలి
ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌లపై సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ల్యాబ్‌లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? సిబ్బందికి తగిన అర్హతలు ఉన్నాయా? నిబంధనల ప్రకారం నిపుణుల పర్యవేక్షణ కొనసాగుతోందా? పరీక్షల నిర్వహణ, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందా? వంటి అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలిన ల్యాబ్‌లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ములుగు జిల్లా ప్రజలు అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.