ఘట్కేసర్, జూలై 8: పోచారం డివిజన్ పరిధిలోని నారపల్లి గ్రామం సప్తగిరి కాలనీ రోడ్ నెం.13లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు.
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు, ఘట్కేసర్ సర్కిల్ అధికారులతో సమన్వయం చేసి మరమ్మత్తు పనులను చేపట్టినట్లు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు తెలిపారు. అధికారుల సూచనలతో డ్రైనేజీ మరమ్మత్తు పనులు ప్రారంభించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎర్ర మాధవి రాజు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
డ్రైనేజీ మరమ్మత్తు పనులు చేపట్టడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.


