బెజ్జంకి,జూన్ 25 (ప్రజావాణి)
వానాకాలం సాగు సీజన్ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 23 నుంచి 30 వరకు రైతు వేదికలలో విత్తన మేళాలు నిర్వహిస్తోంది.ఈ మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ రైతు వేదికలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .బిపిటి-5204 (సాంబ మసూరి), డబ్ల్యూజీఎల్-44 (వరంగల్ సన్నాలు), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం-7715, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్ తదితర సన్న రకాల విత్తనాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు,చిరుధాన్యాలు,కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రైతులు విత్తనాల కోసం వెళ్లే ముందు వారు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) లేదా సమీప రైతు వేదికను సంప్రదించి అవసరమైన విత్తనాల నిల్వ వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ వో తేజస్విని, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




