మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ ఘనాపూర్ గ్రామంలోని ఫకీర్ టేక్కే తండాలో గత మూడు నెలలుగా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. డ్రైనేజీ నీరు ఇళ్ల బాత్రూమ్లలోని సంప్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
డ్రైనేజీ సమస్య కారణంగా తండా ప్రజలు తమ ఇళ్ల బాత్రూమ్లను ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్నానాలు, ఇతర అవసరాల కోసం వంటగదులను వినియోగించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని గత మూడు నెలలుగా సంబంధిత మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మరమ్మతు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని తండా ప్రజలు కోరుతున్నారు.



