మీ అంతర్గత రాజకీయాలకు దివ్యాంగులే బలివేడుకా
40 రోజుల్లో ఇస్తామన్న ఉప పరికరాలు… 14 నెలలు గడిచినా ఎందుకు పంపిణీ లేదు
బీజేపీ నేతల హామీలు గాలిలోనే… దివ్యాంగులకు ఉప పరికరాలు ఎక్కడ
ఎన్పి ఆర్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి
దివ్యాంగులకు ఉప పరికరాల పంపిణీ విషయంలో చోటుచేసుకున్న జాప్యం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. “40 రోజుల్లో అందిస్తాం” అన్న బిజెపి నాయకుల హామీ… 14 నెలలు గడిచినా అమలుకాలేదనే రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి మండిపడ్డారు.
*ఎలా మొదలైంది ఈ ప్రక్రియ?*
కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే అలింకో సంస్థ సహకారంతో, షాద్ నగర్ పట్టణంలోని సాయిరాజా కన్వెన్షన్ హాల్లో జూన్ 10 2025 లో ప్రత్యేక శిబిరం నిర్వహించారు.నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 150 మందికి పైగా అర్హులైన దివ్యాంగుల వివరాలను సేకరించి, ఆన్లైన్లో నమోదు చేశారు.ఆ కార్యక్రమానికి స్థానిక ,రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు హాజరై…అర్హులైన ప్రతి దివ్యాంగుడికి 40 రోజుల్లో ఉప పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
*40 రోజుల్లో ఇస్తామన్న ఉప పరికరాలు… 14 నెలలు గడిచినా ఎందుకు పంపిణీ లేదు?*
అయితే వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.దాదాపు 14 నెలలు గడిచినా ఇప్పటికీ ఉప పరికరాల పంపిణీ జరగకపోవడం పట్ల
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఆనాడు ఇచ్చిన హామీలు మాటల్లోనే మిగిలిపోయాయి.మా హక్కులు నాయకుల అంతర్గత విభేదాల్లో చిక్కుకున్నాయా? అని ప్రశ్నించారు.
*ఇతర నియోజకవర్గాల్లో ఎలా సాధ్యం*
జడ్చర్ల, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.అక్కడ ఆన్లైన్ దరఖాస్తుల తర్వాత కేవలం 40 రోజుల్లోనే దాదాపు 800 మందికి పైగా ఉప పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఆధ్వర్యంలో జరిగిందని గుర్తుచేశారు.
*ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదు.?*
స్థానిక నాయకుల మధ్య సమన్వయం లోపం, పేరుప్రఖ్యాతల కోసం రాజకీయ పోటీలు దివ్యాంగుల సంక్షేమంపై ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది.ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల అర్హులైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి వెంటనే ఉప పరికరాల పంపిణీ చేపట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తమ హక్కుల కోసం బహిరంగంగా ధర్నా చేపడతామని హెచ్చరించింది.దివ్యాంగుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం…నాయకత్వ లోపం వల్ల ఆలస్యమవుతుందా? లేక రాజకీయ లెక్కల మధ్య అసలు లక్ష్యం మరిచిపోయిందా? జవాబు కోసం… దివ్యాంగులు ఇంకా ఎదురుచూస్తున్నారు.




