పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ
గోవిందరావు పేట జూలై 25:
సిపిఎం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. రత్నం రాజేందర్ అధ్యక్షతన జిల్లా స్థాయి పార్టీ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ పార్టీ కార్యకర్తలు ఉద్యమాలను విస్తృతం చేయాలని ఆయన సూచించారు.
పార్టీ సభ్యులు సిద్ధాంతపరమైన అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రజల మధ్య నిరంతరం పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని అన్నారు. గ్రామ కమిటీలు, శాఖ కమిటీలను బలోపేతం చేసి కొత్త సభ్యత్వాలను పెంచాలని, యువతను పార్టీ వైపు ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడేందుకు సిపిఎం కార్యకర్తలు సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకట రెడ్డి,ఎండి దావూద్, చిట్టిబాబు, వాసు, రఘుపతి, మల్లారెడ్డి, చిన్న, రవి, ఐలయ్య, చిరంజీవి, దేవయ్య, శ్రీను మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




