కుమ్మరిపల్లి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ధర్మపురి సిఐ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గాటూర్ మార్చి 28 (ప్రజావాణి):
ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) ఎలపాటి రాంనర్సింహరెడ్డి వెల్గాటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన శనివారం రోజున క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్శనలో భాగంగా సిఐ పరీక్షల నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులను, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్గాటూర్ ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



