పట్టించుకోని ప్రజా ప్రభుత్వం
అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ – పస్రా
గోవిందరావుపేట(ప్రజావాణి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ 12వ వార్డు అభ్యుదయ కాలనీ గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది.
494 ఓట్లు ఉన్న ఈ వార్డులో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.
వార్డు సభ్యురాలు జిమ్మ జ్యోతి గారు కాలనీ సమస్యలను పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు అడగడానికి నాయకులు ఇళ్లకు వస్తున్నారని, గెలిచిన తర్వాత కాలనీ వైపు కూడా తిరిగి చూడడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.
ఇక్కడ కోతుల సమస్య తీవ్రంగా ఉంది. రోజూ ఇళ్లల్లోకి కోతులు వచ్చి ఆహార పదార్థాలు ధ్వంసం చేస్తున్నాయని మహిళలు వాపోతున్నారు.
అధికారులు ఒకసారి కాలనీకి వచ్చి చూస్తే సమస్యల తీవ్రత అర్థమవుతుందని వారు అంటున్నారు.
రోడ్లు లేక, డ్రైనేజీ లేక, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని 12వ వార్డు గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.




