*జిల్లాలో ఫిబ్రవరి 20 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు*
*జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్.*
భద్రాద్రి జిల్లా బ్యూరో/మన ప్రజావాణి, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పత్తి రైతులందరూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సీజన్కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20-02-2026 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల రైతులు తమ పత్తిని సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు.
సీసీఐ ద్వారా ఇప్పటికే కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ కావడంలో కొంత ఆలస్యం జరిగిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ చెల్లింపులు త్వరితగతిన రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. తేదీ 21-02-2026 నుండి జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయబడతాయని తెలిపారు. కావున మిగిలిన కాలవ్యవధిని రైతులు సద్వినియోగం చేసుకొని, తమ పత్తిని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవాలని, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.



