తిరుమలాయపాలెం ప్రజావాణి:
కాకరవాయి, జూపెడ మధ్య ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో తీసుకువచ్చి వందల సంఖ్యలో చనిపోయిన కోళ్లను పడేసి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నెంబర్ ప్లేట్ లేని వాహనంతో వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన వెనుక కూడలి గ్రామానికి చెందిన ఓ కోళ్ల ఫారం వ్యాపారి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి పక్కన పడేసిన కోళ్ల వల్ల తీవ్ర దుర్వాసన వ్యాపిస్తూ, ఈగలు, కుక్కల సంచారం పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
చనిపోయిన కోళ్లను కుక్కలు రోడ్లపైకి లాగి తీసుకువచ్చే ప్రమాదం కూడా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రహదారిపై ప్రయాణించే వారికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఇలాంటి ఘటనల వల్ల వ్యాధులు వ్యాపించే ముప్పు ఉందని, వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పక్కన ఉన్న చనిపోయిన కోళ్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోళ్లను అక్రమంగా పడవేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత కోళ్ల ఫారం లైసెన్స్ను రద్దు చేయాలని కాకరవాయి గ్రామస్తులు కోరుతున్నారు.





