*ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి*
*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 17
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో మందమర్రి మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, డిసిసి ప్రతినిధి పిన్నింటి రఘునాథ్ రెడ్డి లతో కలిసి, మందమర్రి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మండల తహశీల్దార్ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజ్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిందని, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణలో బూత్ స్థాయి ఏజెంట్లు అధికారులకు సహకరించాలన్నారు. నింపిన ఫారాలలోని వివరాలను బూత్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు బిఎల్ఓ యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలని, అర్హత గల ఓటర్లు స్వయంగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని సూచించారు. వర్షాకాలం అయినందున అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ కు ఆధునికరించడం జరిగిందని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





