బెజ్జంకి, ఆగస్టు 8 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బొల్లం సత్తయ్య ఆర్మీలో ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. జూలై 30న సాయంత్రం అకస్మాత్తుగా కాళ్లు, చేతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురయ్యారు. దీంతో ఆయన తోటి సహచరులు ఢిల్లీలోని మాతా రూప్ రాణి మగ్గో ఆసుపత్రిలో చేర్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు.
వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా సత్తయ్య ఊపిరితిత్తులు, కాలేయం, పిత్తాశయం, పేగులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో శస్త్రచికిత్స నిర్వహించి, చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి బొల్లం సత్తయ్య తుదిశ్వాస విడిచారు.సత్తయ్య మృతితో బేగంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహం శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య స్వగ్రామమైన బేగంపేటకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.




