వైఎస్సార్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: శశిధర్ రెడ్డి
అమీన్పూర్, జూలై 8 (ప్రజావాణి): దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన అరుదైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. 2003లో చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 అత్యవసర వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరాలనే లక్ష్యంతో పనిచేసిన మహానేత వైఎస్సార్ అని అన్నారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తి, సంక్షేమ పాలన నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మెంబర్ మల్లేష్ యాదవ్, మహేష్, చుక్క రెడ్డి, కృష్ణ యాదవ్, సురేష్ నాయక్, మస్తాన్ నాయుడు, గోవిందు, రమేష్, ప్రశాంత్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు.


