మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: “బోధించు, సమీకరించు, పోరాడు” అంటూ జనప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం రోజున రేకొండ గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం (AIAYS) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని అంబేద్కర్ సామూహిక భవనం నుండి యువకులు నీలి జెండాలతో, గ్రామపంచాయతీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు.
విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రేకొండ అధ్యక్షులు బోయిని అశోక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అల్లెపు సంపత్, ఉప సర్పంచ్ బిళ్ళ సంతోష్ రెడ్డి, గ్రామ కార్యదర్శి అజయ్ కుమార్, పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సలహాదారులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ దార్శనికుడు, సంఘ సంస్కర్తగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. అసమానతలు, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమం మొత్తం అంబేద్కర్ నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.



