ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం విలీనం
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సామాజిక ఐక్యతకు సరికొత్త అర్థం చెబుతూ యువత గొప్ప నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాన్ని స్వచ్ఛందంగా రద్దు చేసి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎలుకపెల్లి నవీన్ మాట్లాడుతూ, ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వేర్వేరు సంఘాలు ఉంటే యువత మధ్య అనవసరమైన చీలికలు వస్తాయని అన్నారు. ఆ విభేదాలకు తావు లేకుండా అంబేద్కర్ ఆశయాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికే ఈ విలీన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.ఈ నిర్ణయం ద్వారా యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సిద్ధాంతాలకు కట్టుబడి గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. అలాగే అణగారిన వర్గాల హక్కుల కోసం సంఘటిత శక్తిగా రాజీలేని పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సిహెచ్ దిలీప్, బొయిని రాజు, కే సాయికిరణ్, కె నవీన్, ఎం మహేష్, ఆర్ తిరుపతి, సిహెచ్ వెంకటేష్ మరియు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
