ప్రజావాణి న్యూస్: (మార్చి 07) గ్రేడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని ఏఐఎఫ్ఇటిఓ(ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్) జాతీయ కార్యదర్శి పి.రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.ఏఐఎఫ్ఇటిఓ జాతీయ కార్యదర్శి గా నియమితులైన ఎస్టీయూ రాష్ట్రనాయకుడు పి.రమణారెడ్డికి ఎస్టీయు మండలశాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.సత్యనారాయణ, ఎం.బాలరాజు నాయక్ ల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కలసపాడులో సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎస్జీటీగా నియామకం పొంది సుమారు 30 నుండి 35 సంవత్సరాలు సర్వీసు చేసిన తరువాత కూడా పదోన్నతులకు నోచుకోక ఎస్జీటీలుగానే పదవీ విరమణ చెందడం చాలా అన్యాయం అన్నారు.ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎమ్ పోస్ట్ ను మంజూరు చేయడంతో పాటు, ప్రస్తుత ఆదర్శ ప్రాథమిక పాఠశాలల యందలి పిఎస్ హెచ్ఎమ్ పోస్టులన్నింటినీ కూడా ఎస్జీటీ పదోన్నతుల ద్వారానే భర్తీ
చేయాలన్నారు.అయిదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం,అత్యవసర పరిస్థితులలో సెలవులు కూడా వాడుకోవడానికి వీలులేనట్టి ఏకోపాధ్యాయ పాఠశాలల యందు విద్యావాలంటీర్లను నియమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.చట్ట సవరణ చేసి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించినపుడు మాత్రమే ప్రభుత్వ విద్యారంగానికి న్యాయం జరుగుతుందన్నారు. 50సంవత్సరాలు పైబడిన ఎస్జీటీలకు ఏఏఎస్ మరియు పదోన్నతుల విషయంలో శాఖాపరమైన పరీక్షల నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల యందు మాత్రమే పూర్వప్రాథమిక తరగతులను ప్రారంభించి, అంగన్వాడీలను విలీనం చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. లక్షలకు లక్షలు వెచ్చించి,సుదూర ప్రాంతాలలోని కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం పదిహేనువేలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే తల్లికి వందనం అమలు చేయాలన్నారు. అరకొరగా వస్తున్న పాఠశాల నిర్వహణనిధులు ఏమాత్రం సరిపోవడంలేదని,నిర్వహణ నిధులను రెట్టింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాథమిక విద్య అన్ని పాఠశాలలలో మాతృ భాషలో జరిగినప్పుడు మాత్రమే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అదేవిధంగా ఉమ్మడి సర్వీసు రూల్స్,టెట్ మరియు సిపిఎస్ రద్దు పై రాష్ట్రస్థాయిలో,జాతీయస్థాయిలో ఉద్యమాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎన్.వి.రమణయ్య,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.శేఖర్ బాబు,జిల్లాఆర్థికకమిటీ సభ్యుడు కె.వి.సత్యనారాయణ, రీజనల్ ఆఫీస్ ఇన్చార్జి కస్తూరి శ్రీనివాసులు, మండల శాఖ ఆర్థిక కార్యదర్శి పి.గురుప్రసాద్, జిల్లాకమిటీసభ్యులుజి.రమణారెడ్డి,మూల రామకృష్ణారెడ్డి, మండల శాఖ గౌరవాధ్యక్షుడు బి భాస్కర్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్లు,మండలశాఖ కార్యవర్గ సభ్యులు,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.
సెకండరీగ్రేడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
RELATED ARTICLES




