సిద్దిపేట్, ఏప్రిల్ 5, ప్రజావాణి
స్వాతంత్ర్య సమరయోధుడు, నవభారత నిర్మాత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్, జయంతిని పురస్కరించుకుని ఈరోజు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట ఏసిపి రవీందర్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం సాధన కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దేశానికి శాశ్వత ప్రేరణగా నిలిచిందని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని, ఆయన ఆలోచనలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. అలాగే, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అభిలాష్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




