రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచిన ఎస్సై కూచిపూడి జగదీష్.
తిరుమలాయపాలెం,ప్రజావాణి:
మడలంలోని బచ్చోడు గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరిగిన దాడి ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. మేకను గొడ్డలితో కొట్టి చంపడంతో పాటు ఇద్దరిపై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు.సోమనబోయిన మల్సుర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… బచ్చోడు పెద్ద చెరువు కట్ట వద్ద మేకలు మేపుతున్న సమయంలో, మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మేకలు సమీపంలోని కుమ్మరికుంట్ల వెంకన్నకు చెందిన పెసర చేనులోకి వెళ్లాయి. దీంతో ఆగ్రహానికి గురైన వెంకన్న తన చేతిలో ఉన్న గొడ్డలితో ఒక మేకను కొట్టి చంపాడు.అంతేకాక, దీనిపై ప్రశ్నించిన మల్సుర్ మరియు అతనితో ఉన్న పల్లె గురవయ్యపై కర్రతో దాడి చేసి వీపు, తల భాగాల్లో గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితుడు కుమ్మరికుంట్ల వెంకన్నను బచ్చోడు గ్రామంలో అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి, దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.




