పిఆర్సీ కమిటీ వేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం.
2023 జూలై నుండి అమలు కావలసిన 12వ పిఆర్ సి చైర్మన్ ను 32 నెలలు గడిచినా ఇంతవరకు నియమించక పోవడాన్ని నిరసిస్తూ యుటియఫ్ ఆధ్వ్యంలో ఏప్రిల్ 28న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కడప యుటిఎఫ్ భవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 12వ పిఆర్సీ చైర్మన్ ను నియమించినా, వారికి ఎలాంటి కార్యాలయాన్ని, సిబ్బందిని నియమించకపోవడంతో ఆయన రాజీనామా చేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సీ, సకాలంలో డిఏ ల విడుదల, ఆర్థిక బకాయిలు అన్ని చెల్లిస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడిచినా ఇప్పటివరకు 12వ పిఆర్సీ చైర్మన్ ను నియమించకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. యుటియఫ్ నవంబర్ లో చేపట్టిన మొదటి రణభేరి తరువాత ఒక డిఏ, ఇతర ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమైనా, పిఆర్సీ చైర్మన్ నియామకంపై ఎలాంటి ఊసే లేదని, ఫిబ్రవరి 17న రణభేరి 2.0 పేరుతో వేలాదిమంది ఉపాధ్యాయులు విజయవాడ కేంద్రంలో ధర్నా చేసినా ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సైతం పిఆర్సీ, ఐ.ఆర్., డిఏ, బకాయిల కోసం నిధులు కేటాయింపుగాని, ప్రసంగంలో ప్రస్తావనగాని లేకపోవడం విడ్డూరంగా ఉందని వారు విమర్శించారు. నవంబర్ లో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి పిఆర్సీ విషయం నాకు వదిలి వేయండని చెప్పారని, అయితే బడ్జెట్ సమావేశాలలో ఈ అంశం ప్రస్తావిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూశారని, వారి ఆశ నిరాశే అయ్యిందని తెలిపారు. ఇంకా ఎంతకాలం ఉద్యోగులు సహనంతో ఉండాలో, కొత్త పిఆర్సీ కోసం ఎదురు చూడాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటామని ఒకవైపు చెబుతూనే మరొకవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావలసిన ఆర్ధిక ప్రయోజనాలు చెల్లింపు జాప్యం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు 12వ పిఆర్సీ చైర్మన్ నియామకంపై స్పష్టత ఇవ్వాలని, 29% ఐ.ఆర్., 4 డిఏల చెల్లింపు, ఆర్ధిక బకాయిలపై రోడ్ మ్యాప్, పాత పెన్షన్ అమలు, ఇహెచ్ఎస్ కార్డులపై స్పష్టత రాకుంటే యుటియఫ్ రణభేరి 3.0 పేరుతో దశలవారీ కార్యాచరణ చేపడతామని ప్రకటించారు.మార్చి 24వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఒక రోజు నిరాహారదీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో కలక్టరేట్ల వద్ద రెండు రోజులు రిలే నిరాహారదీక్షలు, ఏప్రిల్ 15-19 తేదీలలో 5రోజులు విజయవాడలో రాష్ట్ర స్థాయి రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వేలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఏప్రిల్ 28న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు 12వ పిఆర్సీ చైర్మన్ నియామకం, ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు జి.గోపీనాథ్, కె.సుధాకర్ కార్యవర్గ సభ్యులు రామకేశవ తదితరులు పాల్గొన్నారు.
పి.ఆర్సీ కమిటీ వేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం,యు.టి.ఎఫ్
RELATED ARTICLES




