పాతగూడూర్లో ఘనంగా ఇఫ్తార్ విందు
మతసామరస్యానికి ప్రతీకగా హాజరైన గ్రామస్తులు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 20(ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలోని స్థానిక మసీదు వద్ద శుక్రవారం రోజున ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత ఘనంగా జరిగింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విందు కేవలం ముస్లిం సోదరులకే పరిమితం కాకుండా, గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరై సోదరభావాన్ని చాటుకున్నారు. సాయంత్రం వేళ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, అందరూ కలిసి ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ… రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి, శాంతికి నిదర్శనమని, ఇటువంటి సామూహిక విందులు మనుషుల మధ్య ప్రేమను, ఐక్యతను పెంచుతాయని పేర్కొన్నారు. వచ్చిన అతిథులకు ముస్లిం సోదరులు సాదరంగా స్వాగతం పలికి, ఇఫ్తార్ విందును వడ్డించారు. గ్రామంలో ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంగుల జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ మేడిపల్లి సత్తయ్య, కార్యదర్శి చిందం రమేష్, మాజీ సర్పంచ్ కొంగల రాం చంద్రారెడ్డి, వార్డు సభ్యులు కోట శ్రీశైలం, గాలిపెళ్లి మహేష్, గాజినవేణి రాజేశం, పోర్తి గంగారాములు, ముస్లిం సోదరులు మహమ్మద్ అబ్దుల్లా, షరీఫ్, బషీర్, మమ్మద్, యూసుఫ్, దస్తగిరి, రాజ్ మమ్మద్, రంజాన్, మహబూబ్ అలీ, సఫి మాజీ వార్డు సభ్యులు చెరుకూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.




