జాతరలో పసిపాప మృతి ఘటనపై హత్య కేసు నమోదు చేయాలి
టీఎంఐవి రాష్ట్ర నాయకుడు చుంచు మల్లేశం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 25 (ప్రజావాణి):
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మేరా జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన టీఎంఐవి రాష్ట్ర నాయకుడు చుంచు మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక కుటుంబానికి చెందిన చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లగా, కొందరు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు వారిని అడ్డుకోవడం అమానుష చర్య అని పేర్కొన్నారు. దర్శన టికెట్ పేరుతో గొడవకు దిగిన నిందితులు పసి బాలింతను కూడా కనికరం లేకుండా దాడి చేశారని తెలిపారు. రెండు నెలల శిశువును కిందపడేసి కాలితో తొక్కడం వల్ల మృతి చెందినట్లు ఆరోపించారు. కులం పేరుతో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని అన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కేవలం కుల వివక్ష కేసులు కాకుండా హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. మృతి చెందిన పాప కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని మల్లేశం కోరారు.




