పదో తరగతి విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర
‘జయీభవ విజయీభవ 2.0’లో ఎంఈఓ, సర్పంచ్ పిల్లలు తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 7 (ప్రజావాణి):
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పరీక్షలు ముగిసే వరకు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల విద్యాధికారి (ఎంఈఓ), పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల హరికృష్ణ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘జయీభవ విజయీభవ – 2.0’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ…. విద్యార్థులకు ఇంట్లో చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలని, వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పిల్ల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మారం సునీత జలేందర్ రెడ్డి మాట్లాడుతూ… పదో తరగతి అనేది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి ఆత్మస్థైర్యంతో పరీక్షలకు సిద్ధం కావాలని ఆమె హితవు పలికారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు విషయంలో తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల, పిల్లలు పరీక్షలను చాలెంజిగా తీసుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




