తిరుమలాయపాలెం, ప్రజావాణి:తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్ తండా గ్రామంలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై వివరాలు అడిగిన వార్డు సభ్యుడిపై సర్పంచ్ కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే సర్వసభ్య సమావేశ రిజిస్టర్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ వార్డు సభ్యుడు ఇస్లావత్ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.బాధితుడి వివరాల ప్రకారం గ్రామపంచాయతీ సెక్రటరీ మార్చి 17, 2026 ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ వార్డు సభ్యుల సంతకాలు పొందేందుకు రిజిస్టర్ను గుమస్తా ద్వారా పంపించారు. అయితే సెక్రటరీతో మాట్లాడిన తర్వాతనే తాను సంతకం పెడతానని రాజు స్పష్టంగా తెలిపినట్లు చెప్పారు. అయినప్పటికీ తన అనుమతి లేకుండానే రిజిస్టర్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆయన ఆరోపించారు.ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా సర్పంచ్ ఇస్లావత్ సునిత భర్త తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని రాజు తెలిపారు. “నీకు గ్రామపంచాయతీ నిధులపై ఏమి సంబంధం” అంటూ తనను అవమానించడమే కాకుండా, గ్రామపంచాయతీ కార్యాలయంలోనే తన చొక్కా పట్టుకుని చేతులతో కొట్టాడని ఆరోపించారు. “నీ దిక్కున చోట చెప్పుకో” అంటూ బెదిరింపులకు దిగాడని పేర్కొన్నారు.ఈ ఘటన అంతా గ్రామపంచాయతీ సెక్రటరీ సమక్షంలోనే జరిగిందని రాజు ఆరోపించారు. గ్రామపంచాయతీకి వచ్చిన నిధుల ఖర్చుల వివరాలు అడిగినందుకే తనపై ఈ విధంగా దాడి చేసి బెదిరించారని ఆయన అన్నారు.గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని కోరుతూ తాను ప్రశ్నలు అడిగినప్పటి నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని కూడా రాజు ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న హక్కుతోనే ఖర్చుల వివరాలు అడిగానని, అయితే దీనిని తట్టుకోలేక తనపై దాడి చేశారని తెలిపారు.ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రాజు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, నిజానిజాలను వెలికితీయాలని గ్రామస్థులు కూడా కోరుతున్నారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.