మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించనున్న అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాకుల శివలింగం పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా తెట్టల్పాడు గ్రామంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రేపాకుల శివలింగం మాట్లాడుతూ.. దేశంలో ఒకవైపు మత చాందసవాద ఉన్మాదం, మరోవైపు సరళికృత పెట్టుబడిదారీ విధానాలు ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయ కూలీలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్నాయని అన్నారు. దేశంలో రోజుకు వేలాది చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్నారని తెలిపారు. 2025 నాటికి దేశంలో వ్యవసాయ కూలీల సంఖ్య 14 కోట్లకు పైగా చేరిందని, తెలంగాణలో 60 లక్షలకు పైగా ఉందని పేర్కొన్నారు.ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పుకుంటున్నా ఆకలి సూచికలో భారత్ వెనుకబడి ఉండటం ఆందోళనకరమని అన్నారు.మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో జరిగే మహాసభలు, బహిరంగ సభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమనపల్లి వెంకటేశ్వర్లు, తుపాకుల నాగయ్య, కొండమీద నరసయ్య, తుపాకుల సైదులు, గొడుగు ముత్తమ్మ, కుంబజడ భారతమ్మ, శేఖర్, శ్రీనివాస్, గొడుగు విజయ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.