తిరుమలాయపాలెం, ప్రజావాణి :కాకరవాయి గ్రామం నుంచి మేడిదపల్లి గ్రామానికి ఇసుక తరలింపు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇసుక రీచ్గా గుర్తించని డ్రై ఏరియా నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
మేడిదపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో కొంతమంది కాంట్రాక్టర్లు అనుమతి పత్రాలు చూపిస్తూ ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం. అయితే ఒక కూపన్ లేదా ఒక అనుమతి ఆధారంగా అనేక ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా “పాల్” రెడ్డి పేరుతో కొందరు అనుమతులు ఉన్నట్లు చూపిస్తూ కాకరవాయి ప్రాంతం నుంచి మేడిదపల్లికి ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆ ప్రాంతం అధికారికంగా ఇసుక రీచ్ కాకపోవడంతో డ్రై ఏరియా నుంచి ఇలాంటి అనుమతులు ఎలా జారీ అయ్యాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక కూపన్ పేరుతో ఇష్టానుసారంగా ఇసుక తరలింపు జరుగుతోందా? లేక నిజంగానే అధికారిక అనుమతులేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తహసిల్దార్ కార్యాలయం నుంచి ఈ అనుమతులు ఎలా జారీ అయ్యాయి అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఇసుకను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించే నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే భారతీయ దండన చట్టం సెక్షన్ 379 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాకరవాయి నుంచి మేడిదపల్లికి జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.