అపోహలు నమ్మవద్దని అధికారుల విజ్ఞప్తి
మండలంలో ఇంధన కొరత లేదని స్పష్టం
కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్సులు రద్దు.
గ్యాస్ గోదాములు, బంకులకు కఠిన హెచ్చరికలు.
స్టాక్ వివరాలు ప్రజలకు వెల్లడించాలని ఆదేశాలు.
తిరుమలాయపాలెం, ప్రజావాణి.
తిరుమలాయపాలెం మండలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంధనాలపై వస్తున్న కొరత వదంతులను నమ్మవద్దని తహసీల్దార్ లూథర్ విల్సన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరానికి మించిన నిల్వలు చేసుకోవద్దని సూచించారు.గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకుల్లో కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే అలాంటి నిర్వాహకుల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గ్యాస్ గోదాం, పెట్రోల్ బంకు నిర్వాహకులు తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలను స్టాక్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా గృహ అవసరాల కోసం సుమారు 40 వేల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటికే దాదాపు 25 వేల కనెక్షన్లకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని, కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని తహసీల్దార్ లూథర్ విల్సన్ మరోసారి స్పష్టం చేశారు.




