prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:43 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

*బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, వారి సతీమణి తులసమ్మ గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు , నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గార్లు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికి, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.* *అనంతరం పూలమాలలు, శాలువాలతో నాయకులను ఘనంగా సత్కరించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చల్లగిరిగెల గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ఈ దేవాలయం వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని, కలియుగ ఆరంభంలో పాండవుల మనవడు జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన పవిత్ర క్షేత్రమని తెలిపారు. ఈ ఆలయానికి దక్షిణ ముఖద్వారం ఉండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు. సమీపంలోని కొండలలోని మామిడికోన నుండి ఋషులు వచ్చి స్వామివారిని పూజించేవారని స్థానిక విశ్వాసం ఉందని గుర్తుచేశారు.ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి పద్మాసనంలో ధ్యానముద్రతో కూర్చుని ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి బ్రహ్మవిద్యా రహస్యాన్ని ఉపదేశిస్తున్నట్లుగా విగ్రహాలు ఉండటం అరుదైన ఆధ్యాత్మిక విశేషమని తెలిపారు. వేదాంత జిజ్ఞాసువైన ఆంజనేయ స్వామి భక్తి పారాయణుడిగా ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తున్నట్లుగా ఈ విగ్రహాలు సందేశం ఇస్తున్నాయని పేర్కొన్నారు. నల్లసేనపు రాతితో మలచిన సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాముల దివ్య విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని, ఆలయం చుట్టూ ఉన్న చల్లని ప్రకృతి వాతావరణం, శిల్పకళాసౌందర్యం ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయని చెప్పారు.
గత 60 సంవత్సరాలుగా విశ్వశాంతి, లోకకళ్యాణం కోసం జరుగుతున్న సప్తాహ భజన మహోత్సవాలు ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని తెలిపారు. అనేక మంది భక్తులు ప్రతి ఆదివారం పంటల క్షేమం కోసం ఇక్కడి తీర్థప్రసాదాలను నమ్మకంతో తీసుకెళ్లి పొలాల్లో చల్లడం ఈ క్షేత్రంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం నుండి శ్రీరామనవమి వరకు జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా* నిర్వహించబడుతున్నాయని వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.