30 ఏళ్లుగా మట్టి రోడ్డే గతి
– పస్ర అభ్యుదయ కాలనీ దీనావస్థ.
.ఓట్ల కోసం వస్తారు, సమస్యలు మాత్రం వదిలేస్తారు.
.అభ్యుదయ కాలనీ ప్రజలు,యువత.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ అభ్యుదయ కాలనీలో గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.
ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ కాలనీ వాసుల జీవితాల్లో మాత్రం వెలుగు రాలేదు.
వర్షం పడితే రోడ్డు మీద నడవడం కూడా కష్టమని స్థానికులు వాపోతున్నారు.
తాగునీటి సమస్య, డ్రైనేజీ లేకపోవడం, వీధి లైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ నాయకులు కాలనీకి వచ్చి అన్ని చేస్తామని హామీలు ఇచ్చి వెళ్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గెలిచిన తర్వాత మాత్రం ఎవరూ తిరిగి చూడరని మండిపడుతున్నారు.
“ఓటు కోసం మాత్రమే మనం గుర్తుకొస్తాం” అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సర్పంచ్ కూడా ప్రజా క్షేత్రంలో ఉండడం లేదని, సమస్యలు చెప్పుకునేందుకు ఎవరూ లేరని వారు అంటున్నారు.
అధికారికంగా గ్రామ సభలు పెడుతున్నామని చెప్తున్నా, ఒక్క వార్డు సమస్య కూడా పరిష్కారం కాలేదని ప్రశ్నిస్తున్నారు.
30 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు, తాగునీరు, ఇతర ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాదు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు.