prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 4:24 pm Digital Edition : PRAJA VANI

22-A భూములు, ఆస్తుల రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలి!!

22-A భూములు, ఆస్తుల రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలి!!

టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్

జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18( ప్రజావాణి):జనగామ జిల్లా పరిధిలో 22-A నిబంధనలకు సంబంధించిన భూములు, ఆస్తుల రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు, లావాదేవీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ ఆధ్వర్యంలో టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కి శుక్రవారం లేఖ సమర్పించారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు లకి లేదా సంబంధిత వ్యక్తుల పేర్లపై జనగామ జిల్లా పరిధిలో నమోదైన భూములు, ఆస్తులకు సంబంధించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆయన కోరారు.
అలాగే 22-A జాబితా, పహాణీలు, ROR, భూ భారతి/ధరణి రికార్డులు, పట్టాదార్ పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ లేదా ఇతర నిషేధిత కేటగిరీలకు చెందిన భూములు నిబంధనలకు విరుద్ధంగా బదలాయించబడ్డాయా అనే అంశంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
“ఎవరి మీదా ముందస్తుగా ఆరోపణలు చేయడం మా ఉద్దేశం కాదని,. సంబంధిత భూములు, ఆస్తుల రికార్డులను అధికారికంగా పరిశీలించి, ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఆర్టిఏ మెంబర్ అభి గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు