హామీల వేటలో బీఆర్ఎస్.. సర్కారుపై తిరుగుబాటు బావుటా!
చెన్నారావుపేటలో నర్సంపేట-నెక్కొండ రహదారి దిగ్బంధం
వెయ్యి రోజులైనా అమలు శూన్యమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపాటు
ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పణ
చెన్నారావుపేట సెప్టెంబరు 07 ప్రజావాణి
“మాటల వైభవం.. అమలులో శూన్యం!” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించాయి. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల హామీలను గాలికొదిలేశారంటూ సోమవారం చెన్నారావుపేట మండలం రణరంగంగా మారింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండల అధ్యక్షుడు బాలయ్య వెంకన్న, ఎన్నికల కన్వీనర్ జక్కా అశోక్ నాయకత్వంలో నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు. హామీల అమలును నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను, ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్య గొంతు నొక్కడం ఎవరి వల్లా కాదని హెచ్చరించారు. బేషరతుగా బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణికి వినతి
రహదారి దిగ్బంధం అనంతరం, బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అక్కడ నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట శివానంద్కు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొని సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.