హమర ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు రవి డిమాండ్
బీర్కూర్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమర ప్రసాద్ రచించిన పుస్తకాన్ని ఈ నెల 18న ఆవిష్కరించనున్న నేపథ్యంలో, హమర ప్రసాద్ను వెంటనే అరెస్టు చేసి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు రవి మాదిగ డిమాండ్ చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలో దళితుల ఆధ్వర్యంలో హమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బంగారు రవి మాదిగ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొనడం దేశంలోని 140 కోట్ల ప్రజలను అవమానించినట్లుగా తాము భావిస్తున్నామని అన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆయన సేవలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు, మత, కుల ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిలిపివేసి, ముద్రించిన ప్రతులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎమ్మార్పీఎస్ మేడి పాపన్న ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదవ్ రావు, బస్వాడ రాచకొండ గంగాధర్, శివరాజ్ , బీర్కూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మొక్క రమేష్, జిల్లా పీడీఎస్యూ నాయకులు బాలరాజు, కోరిమే రఘు, రాష్ట్ర సీనియర్ నాయకుడు కదేపురం గంగాధర్,గోవర్ధన్, బస్వంత్, బాలకృష్ణ, మధు, నిరడీ శ్రీనివాస్, సాయిలు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.