నంగునూరు, సెప్టెంబర్ 8 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఎస్సీ సెల్ నాయకులు మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ తప్పెట శంకర్, నంగునూరు మండల చైర్మన్ రాగుల కృష్ణ పాల్గొన్నారు.ఫాంహౌస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల అత్యుత్సాహం కారణంగానే తోపులాట జరిగిందని ఎస్సీ సెల్ నాయకులు ఆరోపించారు.ఈ ఘటనలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ తప్పెట శంకర్, నంగునూరు మండల ఎస్సీ సెల్ చైర్మన్ రాగుల కృష్ణకు స్వల్ప గాయాలైనట్లు నాయకులు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాలని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.