prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:56 pm Digital Edition : MAHESH MEDCHAL

*సూర్యనగర్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది*

*సూర్యనగర్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది*

*డ్రైనేజీ నీటితో రహదారి మొత్తం జలమయం.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు*

మేడ్చల్: పట్టణ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. డ్రైనేజీ పొంగిపొర్లడంతో రహదారి మొత్తం మురుగు నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎంత లోతు ఉందో తెలియక వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు.

*నెలలో 20 రోజులు ఇదే పరిస్థితి*

డ్రైనేజీ పొంగిపొర్లడం సూర్యనగర్ కాలనీలో నిత్య సమస్యగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. నెలలో సుమారు 20 రోజుల పాటు డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో పాటు పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని తెలిపారు.

సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని కాలనీవాసులు ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

*ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?*

రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించిన తర్వాతే అధికారులు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.

వెంటనే రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీటిని తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను శాశ్వతంగా మెరుగుపరిచి మురుగు నీరు తిరిగి రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూర్యనగర్ కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు.