సమాచారం దాచేస్తారా..?
మండల వైద్యాధికారిపై డీఎంహెచ్వోకు జర్నలిస్టుల ఫిర్యాదు
ప్రభుత్వ కార్యక్రమాలకూ మీడియాకు దూరం..
ప్రజలకు సమాచారం ఎలా చేరాలి?
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 18ప్రజావాణి
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల సమాచారాన్ని స్థానిక జర్నలిస్టులకు ముందుగా అందించడం లేదని ఆరోపిస్తూ మండలానికి చెందిన జర్నలిస్టులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి (డీఎంహెచ్వో) ఫిర్యాదు చేశారు.మండల వైద్యాధికారి సరియా అంజుమ్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు తదితర కార్యక్రమాల వివరాలు మీడియాకు చేరడం లేదని జర్నలిస్టులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతలో మీడియాకు సమాచారం అందకపోవడం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలపై పూర్తి అవగాహన కలగడం లేదని వారు పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ప్రజలకు చేరకుండా అడ్డంకులు ఎందుకు?
మండలంలో నిర్వహించే ప్రతి ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించిన సమాచారం మీడియాకు ముందుగానే అందించాలని జర్నలిస్టులు డీఎంహెచ్వోను కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జర్నలిస్టుల ఫిర్యాదుపై స్పందించిన మండల వైద్యాధికారి సరియా అంజుమ్.. ఇకపై మండలంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని జర్నలిస్టులకు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
*హామీ అమలు అవుతుందా*..?
ఇకనైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, మండలంలో నిర్వహించే కార్యక్రమాల సమాచారాన్ని మీడియాకు సమయానుకూలంగా అందించాలని జర్నలిస్టులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవల సమాచారం ప్రజలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.