శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నాటిక ప్రదర్శన కొండాపూర్ గ్రామపంచాయతీలో
దండేపల్లి, సెప్టెంబర్ 5 (సక్రమ ప్రజా పాలన):
శ్రీకృష్ణ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత, చిన్నారులు కలిసి శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు, బాల్య లీలలు, ధర్మబోధలను ప్రతిబింబించేలా నాటికను ప్రదర్శించారు.
శ్రీకృష్ణుడి జననం, గోకులంలో బాల్య జీవితం, కంసుడి దురాగతాలు, ధర్మాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడు చేసిన కార్యాలను నాటిక రూపంలో కళాకారులు చక్కగా ప్రదర్శించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ఆకట్టుకోగా, నాటికను వీక్షించిన గ్రామస్థులు కరతాళధ్వనులతో అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితంలోని ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నాటికను ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నాటికలో కంసుడి వేషధారణలో ఇప్ప ప్రవీణ్, గోపికలుగా ఇప్ప సాయిరాజ్, ఇప్ప జశ్వంత్, శ్రీకృష్ణుడి వేషధారణలో పానుగంటి అభి నటించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇప్ప రవళి–సురేందర్, ఉప సర్పంచ్ మన్నె రవికుమార్, వార్డు సభ్యులు మాదాసు సుమన్, పులిశెట్టి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ ఇప్ప రమేష్, సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.