prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:00 am Digital Edition : SRIKANTH MULUGU

శంకుస్థాపనలో ఉన్న పేరు.. ప్రారంభోత్సవంలో మాయం!

 

 

మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్‌ ఉల్లంఘన…రాజ్యాంగ హోదాకు అవమానమా? అధికారుల నిర్లక్ష్యమా?

 

కేసముద్రం, ఆగస్టు 31 ప్రజావాణి.

 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కల్పించాల్సిన ‘ప్రోటోకాల్’ కేవలం ఒక మర్యాద మాత్రమే కాదు.. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. అయితే, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నేడు జరిగిన ప్రభుత్వ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గౌరవ మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన తీవ్ర చర్చనీయాంశమైంది.శంకుస్థాపన శిలాఫలకంపై సగర్వంగా నిలిచిన ఒక మంత్రి పేరు, తీరా పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి వచ్చేసరికి అధికారిక ఫ్లెక్సీల నుండి మాయమవ్వడం పలు రాజ్యాంగ, పరిపాలనాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

*శిలాఫలకంపై ఉంది.. ప్రారంభోత్సవ శిలాఫలకం,ఫ్లెక్సీలో ఎందుకు లేదు?*

కేసముద్రం పట్టణంలో నూతన మున్సిపాలిటీ భవనం, మూడు మండలాల నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు 2025లో శంకుస్థాపనలు జరిగాయి. ఆయా ప్రభుత్వ విభాగాల నిబంధనల ప్రకారం వేసిన శంకుస్థాపన శిలాఫలకాలపై మంత్రి కొండా సురేఖ పేరును ప్రోటోకాల్ ప్రకారం పొందుపరిచారు. కానీ, సరిగ్గా ఏడాది తిరిగేసరికి 2026 ప్రారంభోత్సవ శిలాఫలకం,వేదికపై ఏర్పాటు చేసిన అధికారిక ప్రభుత్వ ప్రచార ఫ్లెక్సీలలో ఆమె ఫొటో గానీ, పేరు గానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

*ఇంటెన్షనల్ తప్పిదమా? అధికారుల వైఫల్యమా?*

గతంలో పేరు ఉండి, ఇప్పుడు లేకపోవడం వెనుక అధికారుల సమన్వయ లోపం ఉందా? లేక స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధులతో జరిగే పనుల్లో ఒక వర్గం ప్రజాప్రతినిధుల పేర్లను మాత్రమే ప్రమోట్ చేస్తూ, క్యాబినెట్ మంత్రిని పక్కన పెట్టడం ద్వారా అధికారులు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

*తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.!*

 

ఈ తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సి ఎస్ ) తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కారణమైన బాధ్యులైన స్థానిక అధికారులపై విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి రాజ్యాంగబద్ధమైన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠినమైన ఆదేశాలు జారీ చేయడమే ఈ వ్యవస్థకు, ప్రజాప్రతినిధులకు జరిగే అసలైన న్యాయం.