prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:22 pm Digital Edition : MAHESH MEDCHAL

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

మేడ్చల్ సెప్టెంబర్ 10 (ప్రజా వాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ, డబిల్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని డబిల్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పిఎస్పీఎస్ డైరెక్టర్లు మధు, రాజు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ డైరెక్టర్ మధు మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. అన్యాయం, దోపిడీ, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆమె సేవలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా వెంకటేష్ యాదవ్, బాల నరసింహ, ఎం. అశోక్, ఎం. మురళి, మల్లేష్, పి. రాములు, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.