*వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన వీహెచ్పీ*
*- 23వ తేదీ బుధవారం జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకుందాం*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి):
జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ బుధవారం జరుగనున్నాయని, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఉత్సవాలు జరుపుకుందామని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా కార్యవర్గం పట్టణ విగ్రహాలు నిమజ్జనం కానున్న నెల్లుట్ల చెరువు ను సందర్శించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎనగందుల బిక్షపతి మాట్లాడుతూ.. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ చెరువులో కలుషితాలు కలపకుండా కేవలం విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని కోరారు. ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు, వివాదాలు జరగకుండా సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు వారిని కోరారు. నిరంతర ప్రణాళిక, పర్యవేక్షణతో నిమజ్జనాలు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే 5వ రోజు నుండి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయని, త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. లైటింగ్, త్రాగునీరు, గజ ఈతగాళ్లు, అత్యవసర వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ పరిశీలనలో జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు జక్కా ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.