పోరుమామిళ్ల పట్టణంలోని మల్లకత్తువ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మల్లకత్తువ పరిసర ప్రాంతాల్లో ఉన్న కంప చెట్లను జెసిబి యంత్రాల సహాయంతో తొలగించి, నిమజ్జన మార్గాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దు తున్నారు.ఈ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, పోరుమామిళ్ల మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు, వినాయక విగ్రహాలను తరలించే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు మరియు పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొని నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.